Loading...

తన ఇద్దరు కుమార్తెలతో స్వామి వారి దర్శనానికి వెళ్లిన పవన్ కళ్యాణ్

సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని దీక్ష విరమించారు. 11 రోజులపాటు సాగిన ఆయన దీక్షలో భాగంగా ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపధ్యంలో సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత భుజాలకెత్తుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రికి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తన ఇద్దరు కుమార్తెలు ఆద్య కొణిదెల, పోలెని అంజని కొణిదెలలతో కలసి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు.  తన ఇద్దరు కుమార్తెలతో స్వామి వారి దర్శనానికి వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక పూజలు చేసి వారాహి డిక్లరేషన్ ని స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

 అన్ద స్వీకరణ ; 

స్వామి వారి దర్శనం అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రాన్ని సందర్శించారు. అన్నదాన కేంద్రంలోనూ ఆలయ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు. భక్తులకు జరుగుతున్న అన్నదాన సరళిని పరిశీలించారు. అనంతరం సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. 

చిన్న కుమార్తెతో డిక్లరేషన్ ; 

దర్శనానికి ముందు చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెలతో డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేయించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమార్తె పలీనా అంజనితో స్వయంగా డిక్లరేషన్ ఇప్పించారు. కుమార్తె మైనర్ కావడంతో తండ్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఫాంపై సంతకం చేశారు.  శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, తిరుపతి, రైల్వే కోడూరు శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు, శ్రీ అరవ శ్రీధర్ గారు, ప్రముఖ సినీ దర్శకులు శ్రీ త్రివిక్రమ్ గారు, కళా దర్శకులు శ్రీ ఆనంద సాయి గారు స్వామి వారిని దర్శించుకున్నారు