Loading...

ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి

తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీ ఘటనపైనా ఎక్స్ (ట్విటర్ వేదికగా తొలుత తన అభిప్రాయాన్ని పంచుకున్నారు నటుడు ప్రకాశ్ రాజ్. ఆ తర్వాత నుంచి వరుస పోస్టులు పెడుతున్నారు. 'జస్ట్ ఆస్కింగ్' అంటూ ఆయన పోస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా మరో పోస్ట్ పెట్టారు. “మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్దిని సాధించటమా  లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన,  అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా. జస్ట్ ఆస్కింగ్” అని పేర్కొన్నారు. ఆయన ఎవరిని ఉద్దేశించి పెట్టారు  ఎందుకు పెట్టారు అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.  ఈ క్రమంలోనే తాజాగా మరో పోస్ట్ పెట్టారు. "ఇక చాలు.. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి” అని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపైనా ప్రకాశ్ రాజ్ స్పందించిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్స్ ఖాతాను ట్యాగ్ చేస్తూ.. “మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు #జస్ట్ ఆస్కింగ్)" అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. సున్నితాంశాలపై ప్రకాశ్ రాజ్ తెలుసుకుని మాట్లాడాలంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.