నాలుగు వేల కోట్ల విలువైన తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులు ప్రభుత్వానికి అప్పగింత
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత ఆస్తుల జప్తు ఇప్పటి వరకు బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆస్తులు 10 వేల చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం సహా మరెన్నో ఆస్తులు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో భద్రపరిచిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను కోర్టు అధికారులు నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. వీటిలో 10 వేల చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, 1,672 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. వీటిని భారీ భద్రత మధ్య ఆరు ట్రంకు పెట్టెల్లో తరలించారు. న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించారు. ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయింది. ఈ క్రమంలో అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను కర్ణాటకకు తరలించి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఇప్పటి వరకు భద్రపరిచారు. జప్తు చేసిన సమయంలో ఈ ఆస్తుల విలువ రూ. 913.14 కోట్లుగా అధికారులు అంచనా వేయగా, ఇప్పుడు కనీసం రూ. 4 వేల కోట్లుగా ఉండొచ్చని సమాచారం.